
చిత్తూరు స్కూల్లో విషపురుగుల దాడి. పదిహేను మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స, పిల్లలు క్షేమం. 15 Students Hospitalised: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డి.యం.
పురం ప్రభుత్వ పాఠశాలలో విషపురుగుల దాడి తీవ్ర కలకలం రేపింది. తరగతి గదిలో చదువుకుంటున్న దాదాపు 15(15 Students Hospitalised) మంది విద్యార్థుల శరీరంపై ఒక్కసారిగా తీవ్రమైన దురదలు, పెద్ద పెద్ద దద్దుర్లు రావడంతో పాఠశాలలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పిల్లల ఇబ్బందిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై, పాఠశాల పరిసరాల్లో తిరుగుతున్న ఒక వింత రకమైన విషపురుగు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించారు. AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి ఆలస్యం చేయకుండా ఉపాధ్యాయులు బాధితులైన విద్యార్థులందరినీ పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాదముని రెడ్డి ఈ విషయాన్ని వెంటనే కార్వేటినగరం ఎంఈఓ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు విద్యార్థులకు తక్షణమే అత్యవసర చికిత్స, యాంటీ అలర్జీ మందులను అందించారు. ఈ పురుగుల కాటు వల్ల ప్రాణాపాయం ఏమీ లేదని, పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేయడంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడం, చెత్తాచెదారం పెరగడంతో ఇటీవలి కాలంలో ఇటువంటి వింత విషపురుగుల బెడద ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు. పొడవాటి శరీరం, పొట్టి రెక్కలతో ఉండే ఈ కీటకాలు శరీరంపై పాకడం లేదా కుట్టడం వల్ల చర్మంపై తీవ్రమైన మంట, దద్దుర్లు వస్తాయి. ఇవి సాధారణంగా మురికి, తడి ప్రదేశాలు మరియు కుళ్ళిపోయే వ్యర్థాల మధ్య పెరుగుతాయని, కాబట్టి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.