
రాంచీ: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది చాలామందికి ఉండే కల. 20 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఓ వ్యక్తికి ఆ కల నెరవేరినా.. విధులు నిర్వర్తించే అవకాశమే లేకుండాపోయింది.
ఎందుకంటే, రిటైర్మెంట్ వయసుకు ఒకరోజు ముందు పోస్టింగ్ లెటర్ వచ్చింది. ఈ చోద్యం ఝార్ఖండ్ (Jharkhand)లో వెలుగుచూసింది.
జామ్తాఢా జిల్లాకు చెందిన నందలాల్ 2006 నుంచి పారాటీచర్ (తాత్కాలిక)గా పనిచేశారు (Jharkhand Teacher). ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వాలు వారిని నియమిస్తుంటాయి. శాశ్వత హోదా, వేతన సమానత్వం కోసం ఝార్ఖండ్లోని తాత్కాలిక ఉపాధ్యాయులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్లను నెరవేర్చేలా.. పర్మినెంట్ అసిస్టెంట్ టీచర్ ఖాళీల్లో 50 శాతం పోస్టులను ప్రభుత్వం వారికి కేటాయించింది. వయసు విషయంలో నియామక నిబంధనలను సడలించింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో ఉత్తీర్ణత సాధించిన వారిని పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే 2016లో నందలాల్ టెట్ రాసి ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ టీచర్గా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. 2023లో నియామకాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అప్పుడు ఆయన వయసు 57ఏళ్లు. ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యేసరికి మూడేళ్లు పట్టింది. చివరకు జూన్ 29న ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. అయితే ఆ మరుసటి రోజే ఆయనకు 60 ఏళ్లు నిండాయి. ఝార్ఖండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు. అంటే పదవీవిరమణ వయసుకు ఒకరోజు ముందు పోస్టింగ్ లెటర్ (One Day Appointment) రావడంతో నందలాల్ షాక్కు గురయ్యారు.
‘‘20 ఏళ్లుగా టీచర్గా పనిచేశాను. టెట్ పాసయ్యాను. ఇన్నేళ్లు ఎదురుచూస్తే.. ఇలా అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది’’ అని ఆయన వాపోయారు. పలామూ ప్రాంతానికి చెందిన నియుమ్ అన్సారీది అదే పరిస్థితి. మే 31న ఆయనకు 60 ఏళ్లు దాటాయి. రిటైర్మెంట్ వయసు దాటిన ఆయన్ను రెగ్యులర్ టీచర్గా నియమిస్తూ.. సోమవారం లెటర్ రావడం గమనార్హం. కాగా.. ఆరోజు రాజధాని నగరం రాంచీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. కొత్తగా నియమితులైన 1042 టీచర్లకు లెటర్లు ఇచ్చారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది వీరేనంటూ మాట్లాడారు. కానీ, పదవీవిరమణకు దగ్గరపడినవారు ఆ వెయ్యిమందిలో ఉండటం చర్చనీయాంశమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆధునిక కాలంలో మహిళలు సైతం రైడర్లుగా రాణిస్తున్నారు.