ATF Price Cut : జులై 1న ఇంధన ధరల పరంగా వరుస అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి.
తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారనప్పటికీ అతిపెద్ద ప్రైవేట్ రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించింది. పెట్రోల్ ధర రూ. 5, డీజిల్ ధర రూ. 3 మేర తగ్గించింది. ఇదే సమయంలో కేంద్రం.. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ భారీగా తగ్గించింది. ఇక ఇప్పుడు అదే ఏటీఎఫ్ లేదా జెట్ ఫ్యూయెల్కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. విమాన ప్రయాణికులకు, ఎయిర్లైన్స్ కంపెనీలకు ఊరటనిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జులై 1న కీలక ప్రకటన చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా దిగొస్తున్న క్రమంలో విమానాల్లో వాడే జెట్ ఇంధనం (ఏటీఎఫ్) ధరను లీటరుకు దాదాపు రూ. 5 మేర తగ్గించింది. కిలో లీటరుకు రూ. 5 వేలు తగ్గిందన్నమాట. అసలు ఈ తగ్గింపు వల్ల విమాన టికెట్ రేట్లు తగ్గుతాయా.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జెట్ ఫ్యూయెల్ ధర లీటరుకు రూ. 5 తగ్గి ప్రస్తుతం ఢిల్లీలో ఇది రూ. 110 కి చేరింది. అంటే కిలో లీటరుకు రూ. 1.10 లక్షలుగా ఉంది. ఇవాళ ఉదయమే విమాన ఇంధనం ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ను లీటరుపై రూ. 12.50 నుంచి 7.5 రూపాయలకు తగ్గించింది. ఇక్కడ దాదాపు 40 శాతం వరకు ఎగుమతి సుంకం తగ్గింది. ఇప్పుడు విమాన ఇంధనం ధర కూడా తగ్గడం ఊరట కలిగించే అంశం. దీని వల్ల విమాన టికెట్ ధరల్ని ఎయిర్లైన్స్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఒక విమాన సంస్థ నడవడానికి అయ్యే ఖర్చులో దాదాపుగా 40 శాతం ఈ జెట్ ఫ్యూయెల్ కోసమే అవుతుంది. ఇప్పుడు లీటరుపై రూ. 5 తగ్గడం వల్ల ఇండిగో, ఎయిరిండియా, స్పైస్ జెట్ వంటి కంపెనీలపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. ఇదే సమయంలో ప్రస్తుతం వర్షా కాలం కావడంతో విమాన ప్రయాణాలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఈ తరుణంలోనే ఇంధన ధరలు తగ్గడం వల్ల రానున్న రోజుల్లో ఎయిర్లైన్స్ సంస్థలు ఆఫర్ల రూపంలో టికెట్ ధరల్ని తగ్గించే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభుత్వ సంస్థల్లో మాత్రం ఇంధన ధరల్ని కేంద్రం మార్చకుండా యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది.