
Aaruguru Pathivrathalu: దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ ఆరుగురు పతివ్రతలు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం రీ-రిలీజ్ పోస్టర్ను విడుదల చేసింది.
టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న వేళ మరో కల్ట్ క్లాసిక్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరుగురు పతివ్రతలు చిత్రం మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అధికారిక రీ-రిలీజ్ పోస్టర్ను విడుదల చేసింది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తన బోల్డ్ కంటెంట్, వినూత్న కథ, హాస్యంతో మంచి సంచలనం సృష్టించింది. పెళ్లిళ్ల పేరుతో జరిగే మోసాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, మనస్పర్థలను వినోదాత్మకంగా చూపిస్తూ సమాజంలోని కొన్ని వాస్తవాలను ఈవీవీ తనదైన శైలిలో ఆవిష్కరించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.
కథ పరంగా చూస్తే.. చిన్ననాటి స్నేహితులైన ఆరుగురు మహిళలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పెళ్లి సందర్భంగా మళ్లీ కలుసుకుంటారు. తమ తమ వైవాహిక జీవితాల్లో ఎదురైన అనుభవాలు, భర్తలతో ఉన్న సంబంధాలు, సమస్యలు, భావోద్వేగాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. మహిళల కోణంలో వివాహ బంధాన్ని హాస్యంతో మేళవించి చూపించిన తీరు ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
ఈ సినిమాతో దర్శకుడు ఈవీవీ ఏకంగా 42 మంది కొత్త నటీనటులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఎల్.బి. శ్రీరామ్, చలపతిరావు, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, కమలాకర్ అందించిన సంగీతం కూడా సినిమాకు మరింత బలం చేకూర్చింది.
ఇప్పటి ప్రేక్షకులకు కూడా సులభంగా కనెక్ట్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో ఉండటంతో రీ-రిలీజ్పై మంచి అంచనాలు నెలకొన్నాయి. పాత తరం ప్రేక్షకులతో పాటు నేటి యువత కూడా ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూడాలని ఆసక్తి చూపుతున్నారు. రీ-రిలీజ్ తేదీని చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.