
IND vs ENG : భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది.
ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్కిడ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్, బ్రాడ్కాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్కే పరిమితం చేసింది. ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై మ్యాచ్ అయితే ఈ కుర్రాడికి ఒత్తిడి తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ సిరీస్లో భారత్ 0-2తో ఓడిపోవడమే కాకుండా వైభవ్కు అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, వైభవ్ తన అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని అనడం మరింత దుమారం రేపింది.
వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడంపై బీహార్లోని బేగుసరాయ్ ఎంపీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా స్పందించారు. బీహార్లోని సమస్తీపూర్కు చెందిన ఈ 15 ఏళ్ల స్టార్ ప్లేయర్ను పక్కన పెట్టడంపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లను ఆయన తప్పుబట్టారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రయాన్ లారా వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే వైభవ్ టాలెంట్ను మెచ్చుకుంటూ, అతని చుట్టూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ను నిర్మించవచ్చని అన్నారని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు ఉన్న వైభవ్ ప్రపంచ క్రికెట్ భవిష్యత్తు అని, అలాంటి ఆటగాడిని ఎందుకు ఆడించట్లేదని మంత్రి ప్రశ్నించారు.
ఇంగ్లాండ్తో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఈ రాజకీయ ఒత్తిడిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వైభవ్ను జట్టులోకి తీసుకోవాలంటూ రాజకీయ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించగా శ్రేయస్ అయ్యర్ చాలా కూల్గా, అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు. “న్యూస్ ఛానళ్లలో ఏం నడుస్తోంది లేదా సోషల్ మీడియాలో ఎవరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారనే విషయాలను నేను అస్సలు ఫాలో అవ్వను” అని శ్రేయస్ స్పష్టం చేశాడు. బయట నుంచి వచ్చే ఇలాంటి ఒత్తిళ్లను తాము పట్టించుకోమని, తమ ఫోకస్ అంతా ఇంగ్లాండ్ సిరీస్ గెలవడంపైనే ఉందని చెబుతూ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి ఏకంగా 776 పరుగులు సాధించాడు. అందులో ఒక సంచలన సెంచరీ కూడా ఉంది. ఒంటిచేత్తో తన జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఐపీఎల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శన చూసే సెలక్టర్లు అతడిని సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. గతంలో ఇండియా అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్ అద్భుతంగా రాణించిన రికార్డు కూడా ఉంది. ప్రస్తుత సీనియర్ జట్టులో సంజూ శాంసన్ వరుసగా ఫెయిల్ అవుతుండటంతో, అతని స్థానంలో ఈ బీహార్ కుర్రాడికి ఇంగ్లాండ్తో జరిగే మొదటి టీ20లోనే అవకాశం ఇవ్వాలని, అప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అతను సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..