
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య విరాళాల అపహరణపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆలయంలోని (Ayodhya Ram Temple) విరాళాల లెక్కింపు వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకున్న ఈ ఇంటిదొంగలు.. చాలా సునాయాసంగా సొమ్ము బయటకు తరలించినట్లు తెలుస్తోంది. దొంగలించిన సొత్తును వాష్రూమ్ల్లో దాచి.. ఎవరికీ కనబడకుండా తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసులో (Ram Mandir Donation Theft Case) ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో నిందితుల్లో ఒకడైన అవినాష్ శుక్లాను పోలీసులు మంగళవారం రెండు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతడు కీలక విషయాలు బయటపెట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. విరాళాల కౌంటింగ్ గదికి ఉన్న తాళాలను మరో నిందితుడు టిన్నూ యాదవ్ సంపాదించాడు. అనంతరం ఎవరూ లేని సమయంలో ఆ గదిలోని డబ్బును చోరీ చేశామని శుక్లా తెలిపినట్లు సమాచారం.
ఇక ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.. వాటిని ఎవరు పరిశీలిస్తారన్న వివరాలు నిందితులకు బాగా తెలుసు. దాన్ని అనువుగా తీసుకున్న నిందితులు.. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా చోరీ చేసిన సొమ్మును వాష్రూమ్ల్లో దాచిపెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ తర్వాత సమయం చూసుకుని ఆ డబ్బును బయటకు తరలించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులతో తమకున్న సాన్నిహిత్యం కారణంగా.. తమను ఎవరూ అనుమానించలేకపోయారని అవినాష్ శుక్లా విచారణలో వెల్లడించాడు.
చోరీ చేసిన సొమ్ముతో తాను ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు శుక్లా విచారణలో అంగీకరించాడు. దీంతో అతడి ఆర్థిక లావాదేవీలతో పాటు, ఇతర నిందితుల ఆస్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు సుదీర్ఘకాలంగా ఎలా ఈ చోరీ చేశారు? వీరి వెనుక ఇంకెంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, విచారణ సమయంలో నిందితులు పలుమార్లు ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.