
విలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఓ సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ మంగళవారం అధికారికంగా...
విలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఓ సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫన్నీ టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. సున్నితంగా, సుకుమారంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే హీరో (తిరువీర్) కోరిక తీరుతుంది. కానీ పెళ్లి తర్వాత భార్య (ఐశ్వర్య రాజేశ్)ను తాకితే షాక్ కొట్టడం వంటి వినూత్న అంశంతో ఈ కథ సాగుతుంది. ఈ పాయింట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.'మసూద', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. 'శివం భజే' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ దర్శన్కు దర్శకుడిగా ఇది మొదటి సినిమా కావడం విశేషం.ఈ చిత్రానికి కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తుండగా, 'బలగం' ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.