
తాండూరు: పట్టపగలే దొంగలు ఇంట్లోకి చొరబడి 10 తులాల బంగారం, రూ.3 లక్షల నగదును దోచుకెళ్లారు. వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర నగర్‌లో ఈ సంఘటన జరిగింది. యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతానికి చెందిన అయ్యన్న, మల్లీశ్వరి దంపతులు. 15 ఏళ్ల కిందట ఉపాధి కోసం వారు తాండూరు పట్టణ శివారు యాలాల మండల పరిధి మిత్రనగర్‌కు వచ్చారు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సమీపంలోనే టీ కొట్టును నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. బుధవారం ఉదయం మల్లేశ్వరి టీ కొట్టుకు వెళ్లింది. 11.30 గంటలకు ఆమెను ఇంటికి పంపించేందుకు భర్త అయ్యన్న టీ కొట్టుకు వెళ్లాడు. మల్లీశ్వరి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులకు వేసిన తాళం పగలగొట్టి ఉంది. మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లి బీరువాను చూడగానే వస్త్రాలు చిందర వందరంగా పడి ఉన్నాయి. 10 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని నిర్ధరించుకుని భర్త అయ్యన్నకు విషయం తెలిపారు. జరిగిన ఘటన వివరిస్తూ అయ్యన్న యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విటల్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రల ఆధారంగా వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





