
ఏ పథకంలోనూ చేర్చనందున కేంద్రం నిర్ణయం ఉత్తర, దక్షిణ భాగాల సమాంతర పనులు అనుమానమే ఈనాడు, హైదరాబాద్‌: ఏ పథకంలోనూ చేర్చనందున ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌ ప్రాజెక్టు మంజూరును కేంద్రం పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. భారత మాల పరియోజన కింద ఉత్తర భాగం పనులను ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతోంది. అలాగే దక్షిణ భాగం పనులకు కూడా ఏదో ఒక పథకంలో చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఎలైన్‌మెంట్‌ను మోర్త్‌కు సమర్పించింది. దాన్నే ఉత్తర భాగం పనులతో సమాంతరంగా చేపట్టాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవానికి ఉత్తర భాగం 161.51 కిలోమీటర్లు.. దక్షిణ భాగం 201 కిలోమీటర్లు కలిపి ఆర్‌ఆర్‌ఆర్‌ మొత్తం 362.51 కిలోమీటర్ల మేర ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని ఇటీవల ఆర్‌అండ్‌బీ అధికారులు రాసిన ఓ లేఖకు మోర్త్‌ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఉత్తర, దక్షిణ భాగాల పనులు సమాంతరంగా కొనసాగడం అనుమానంగా కనిపిస్తోంది. ఫ్యూచర్‌ సిటీ మీదుగా.. దక్షిణ భాగంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఎలైన్‌మెంట్‌ ఉంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని తంగడ్‌పల్లి నుంచి సంగారెడ్డి వరకు మొత్తం 201 కి.మీ. రహదారిని గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా ఆరు వరుసలతో రూపొందించింది. ఎన్‌హెచ్‌-65, 44, 163, 19, 76లను ఈ రహదారి కలుపుతుంది. యాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 55 నివాస ప్రాంతాల మీదుగా ఈ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మొత్తం 2,010 హెక్టార్ల భూసేకరణ అవసరమని గుర్తించింది. ఈ వివరాలతో రూపొందించిన ఎలైన్‌మెంట్‌ను ప్రస్తుతం కేంద్రం పెండింగ్‌లో ఉంచింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




