
మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడేందుకు రంగం సిద్దమైంది. గత కొద్ది రోజులుగా రాగి ధరలు ఆకాశాన్నంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు దిశగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కాపర్ ధర టన్నుకు 14 వేల డాలర్ల మార్కును క్రాస్ చేసింది. కాపర్పై అమెరికా భారీగా సుంకాలు విధించనుందనే వార్తల క్రమంలో వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్లపై కూడా పడుతుండగా.. భారతదేశంపై కూడా పడుతోంది. రాగిని డేటా సెంటర్లతో పాటు ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, టెలికాం, వ్యవసాయం వంటి రంగాల్లో వినియోగిస్తున్నారు. దీంతో ఈ రంగాలపై ధరల పెంపు ప్రభావం పడుతోంది. దీంతో ఈ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దేశంలో పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.





