
ఇంటర్నెట్ డెస్క్: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ (K Bhagyaraj), 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె.భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన.. ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే గాక, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా (SIIMA) జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రాలకు ఆయనే కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. స్క్రీన్ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ



