
హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్కు భారీ స్పందన లభిస్తోంది. 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,340 ఇళ్ల కోసం శనివారం వరకు ఏకంగా 35,125 దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 10 వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. దీంతో చివరి గడువులో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. ఆగస్టు 20న లాటరీ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు గౌతమ్ తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణ అనంతరం తుది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఎంపిక ప్రక్రియలో అర్హత ఉన్నవారికే ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.ఎంపికైన లబ్ధిదారులకు ఏడాదిలోపు ఇళ్లను నిర్మించి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.10 వేల ధరావతు ఫీజుపై కూడా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇల్లు కేటాయించని దరఖాస్తుదారులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. దీంతో దరఖాస్తుదారుల్లో నెలకొన్న అనుమానాలకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లయింది. నియోజకవర్గాల వారీగా చూస్తే కూకట్పల్లి నుంచి అత్యధికంగా 5,233 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఖైరతాబాద్ నుంచి 4,394, కుత్బుల్లాపూర్ నుంచి 4,121, నాంపల్లి నుంచి 3,613 దరఖాస్తులు నమోదయ్యాయి. మలక్పేటలో 2,846, శేరిలింగంపల్లిలో 2,530, అంబర్పేటలో 2,357 దరఖాస్తులు వచ్చాయి. కార్వాన్లో 1,574, రాజేంద్రనగర్లో 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 1,374, మేడ్చల్లో 1,153, బహదూర్పురలో 1,135, సనత్నగర్లో 1,046, మల్కాజిగిరిలో 1,033 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నంలో 749, మహేశ్వరంలో 471 దరఖాస్తులు వచ్చాయి.16 నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న 7,340 ఇళ్లతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే నాలుగున్నర రెట్లు దాటింది. దీంతో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో ఆసక్తి నెలకొంది. దరఖాస్తులకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం 040-24603572 నంబర్లో సంప్రదించాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచించారు.





