

- ఆరంఘర్లో ఘోర ప్రమాదం
- లారీ ఢీకొని ఇద్దరు
- పెళ్లి ఇంట్లో విషాదం
Aramghar Road Accident: హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా వద్ద గురువారం అత్యంత తీవ్రమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హయత్నగర్ వైపు నుంచి అత్తాపూర్ వైపు అతివేగంగా కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ.. చౌరస్తా వద్ద బైక్పై వెళ్తున్న తండ్రీకూతుళ్లను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది(Aramghar Road Accident). ప్రమాద తీవ్రతకు బైక్ లారీ చక్రాల కింద నలిగిపోవడంతో, బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, ఆయన కుమార్తె తీవ్ర గాయాలపాలై లారీ కిందే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిత్యం వాహనాలతో కిటకిటలాడే ఆరంఘర్ జంక్షన్లో ఈ ఘోర ఉదంతం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
మృతులను అత్తాపూర్కు చెందిన ఇస్మాయిల్ ఖాన్, ఆయన కుమార్తె బురుషాన్ బేగంగా పోలీసులు గుర్తించారు. మరో వారం రోజుల్లో బురుషాన్ బేగం వివాహం జరగాల్సి ఉండటంతో, శుభలేఖలు పంచడం, పెళ్లి పనుల నిమిత్తం తండ్రీకూతుళ్లు ఇద్దరూ బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో, ఈ ఊహించని ప్రమాదంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





