
భారతదేశ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నెలలో గత 126 ఏళ్ల చరిత్రలోనే మూడో అత్యంత దారుణమైన అల్ప వర్షపాతం నమోదైంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కేవలం 92.
1 మిల్లిమీటర్ల నైరుతి రుతుపవనాల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణంగా కురవాల్సిన వర్షపాతం కంటే ఏకంగా 42 శాతం లోటు కావడం గమనార్హం. జూన్ నెల మంగళవారంతో ముగియనుండటంతో ఈ ఏడాది జూన్ వర్షపాతం రికార్డు స్థాయిలో అత్యంత కనిష్టానికి పడిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.భారత వాతావరణ శాఖ ప్రకారం.. 1901 నుంచి ఇప్పటివరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే జూన్ నెలలో దేశవ్యాప్తంగా 100 మిల్లిమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యంత దారణమైన ఏడాదిగా 2009 నిలిచింది. అప్పట్లో కేవలం 87.5 మిల్లిమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఆ తర్వాత 1905లో 92.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడాది జూన్ నెల ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించనుంది. గతంలో 2014లో 93 మిల్లిమీటర్లు, 1926లో 97.4 మిల్లిమీటర్ల మేర జూన్ వర్షపాతం నమోదు కాగా.. మరికొన్ని అల్ప వర్షపాత సంవత్సరాలుగా 1902 (109 మిమీ), 1912 (106.8 మిమీ), 1923 (101.7 మిమీ) నిలిచాయి. సాధారణంగా వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జూన్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 165 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి.ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే కాకుండా ఆ తర్వాత సుమారు 11 రోజుల పాటు ఒకే చోట నిలిచిపోయాయి. వ్యవసాయ పరంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని చాలా భాగాలు.. గుజరాత్‌తో కూడిన మధ్య, ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అధిక ప్రాంతాలకు రుతుపవనాలు ఇంకా విస్తరించలేదు. అలాగే రుతుపవనాలు ప్రవేశించిన మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీకి జూన్ 27నే రుతుపవనాలు రావాల్సి ఉండగా.. ఈ గడువు తప్పింది. జులై మొదటి వారంలోనే ఢిల్లీకి వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు.మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్‌నినో ఎఫెక్ట్ భయాల నేపథ్యంలో ఐఎండీ గత నెలలోనే తన దీర్ఘకాలిక రుతుపవనాల అంచనాను సవరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సగటు వర్షపాతం 90 శాతానికి పడిపోవచ్చని పేర్కొంది. ఈ వర్షభావ పరిస్థితుల హెచ్చరికలు దేశంలోని రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే జూన్ నెలలో వర్షాలు ఆశాజనకంగా లేనప్పటికీ.. అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వర్షాల విస్తరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వాతావరణ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ మాట్లాడుతూ.. రుతుపవనాలు విస్తరించిన రాష్ట్రాలలో ఇప్పటివరకు వర్షపాతం బాగానే ఉంది. అంతేకాకుండా గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు, జలాశయాల పరిస్థితి ప్రస్తుతం అంత దారుణంగా ఏమీ లేదు అని సానుకూలంగా స్పష్టం చేశారు.