
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని సరైన పద్ధతిలో, మితంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్లో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని సరైన విధంగా తీసుకోకపోతే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, శరీరంలో వేడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ను నేరుగా తినడం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి, పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రోజుకు సుమారు 20 నుంచి 30 గ్రాముల వరకు మాత్రమే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఎండు ఖర్జూరాలు, వాల్నట్స్, నానబెట్టని బాదంపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ను ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో వీటిని మితంగా తీసుకోవడం, వీలైతే నానబెట్టి తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి, మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
నానబెట్టిన బాదంపప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరాలను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. అలాగే మఖానా (ఫాక్స్ నట్స్) తేలికైన, ఆరోగ్యకరమైన చిరుతిండిగా పరిగణిస్తారు. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరానికి చల్లదనాన్ని అందించే గుణాలు కలిగి ఉంటుందని చెబుతారు.
డ్రై ఫ్రూట్స్ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని మితంగా, సరైన పద్ధతిలో, కాలానుగుణంగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మధుమేహం, అధిక బరువు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ను తమ నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?