
తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల ఎంట్రీ, ఉప ఎన్నికల సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ అరంగేట్రం గురించిన ఊహాగానాలకు...
తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల ఎంట్రీ, ఉప ఎన్నికల సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ అరంగేట్రం గురించిన ఊహాగానాలకు తెరదించుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో త్వరలో జరగబోయే తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని లారెన్స్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. అంత హడావుడిగా నిర్ణయాలు తీసుకోలేనని, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమా ప్రాజెక్టులు, సామాజిక సేవా కార్యక్రమాలపైనే ఉందని మీడియాకు వివరించారు.
రాఘవ లారెన్స్ ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు."నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి.. ప్రతిఫలంగా దేనినీ ఆశించకు" అనే భగవద్గీత సూక్తిని ప్రస్తావిస్తూ ఆయన తన సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై మాట్లాడుతూ.. తనకు హడావుడిగా ఎమ్మెల్యేనో, మంత్రినో అయిపోవాలనే ఆరాటం లేదన్నారు. రాజకీయాలు అనేవి కూరగాయల మార్కెట్ లాంటివి కావని, మనం వెళ్లే చోట మనకు సరైన గౌరవం, గుర్తింపు ఉండాలని పేర్కొన్నారు. గతంలో ప్రజలు, అభిమానులు కోరుకుంటేనే తాను రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించిన లారెన్స్.. తాజాగా ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో గతంలో ఆయన చేసిన కొన్ని కామెంట్ల వివాదంపై లారెన్స్ మరోసారి స్పందించారు. ఓ సందర్భంలో ఆయన ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్, వివాదం నడిచింది. దీనిపై లారెన్స్ స్పందిస్తూ.. తాను అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని, కొందరు తన మాటలను తప్పుగా చిత్రీకరించారని లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. తనకు అండగా నిలుస్తున్న అభిమానులకు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లారెన్స్ ఇచ్చిన ఈ క్లారిటీతో తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారానికి బ్రేక్ పడింది.
మరోవైపు లారెన్స్ తప్పుకోవడంతో ఇక్కడ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. అనంతరం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నియమ నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో, సీఎం విజయ్ తన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి టీవీకే పార్టీ తరఫున ప్రముఖ నటి త్రిషను బరిలోకి దించుతారనే ప్రచారం మొదటి నుంచి బలంగా సాగుతోంది.
మధ్య రాఘవ లారెన్స్ పేరు తెరపైకి రావడంతో త్రిషకు బదులు ఆయనను రంగంలోకి దించుతారేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా లారెన్స్ తాను రేసులో లేనని అధికారికంగా ప్రకటించడంతో నటి త్రిషకు రూట్ క్లియర్ అయిందని కోలీవుడ్ అలాగే తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన ప్రతిష్టాత్మక స్థానం కావడం వల్ల ఇక్కడ త్రిష పోటీ చేస్తే ఎన్నికల బరి అత్యంత ఆసక్తికరంగా మారడం ఖాయం. అయితే ఈ ప్రచారంపై టీవీకే పార్టీ గానీ, నటి త్రిష గానీ ఇంకా అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. త్రిష నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.