
ICC Women's T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ సాధించాలన్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం లండన్లోని లార్డ్స్లో జరిగిన చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు...
ICC Women's T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ సాధించాలన్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం లండన్లోని లార్డ్స్లో జరిగిన చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది మన ఉమెన్స్ టీం. అంతకుముందు బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా గెలవడంతో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఆస్ట్రేలియాపై భారీ తేడాతో గెలిస్తేనే నెట్ రన్ రేట్ పరంగా అవకాశం ఉండేది. కానీ ఆసీస్ 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో, మన అమ్మాయిల టోర్నీ ప్రయాణం ముగిసింది. గతేడాది నవంబర్లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన 'విమెన్ ఇన్ బ్లూ'.. ఈసారి అంచనాలను అందుకోలేకపోయింది. మరి టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఎందుకు వెనుదిరిగింది? కీలక కారణాలేంటో ఓసారి చూద్దాం.
పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్పై గెలిచినా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లతో జరిగిన కీలక మ్యాచ్లలో మన అమ్మాయిలు తేలిపోయారు. ఈ రెండు జట్లపైనా మంచి స్కోర్లు చేసినా, వాటిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 158 పరుగుల లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. మరిజాన్ కాప్ ఇచ్చిన రెండు కీలక క్యాచ్లు జారవిడచడంతో మ్యాచ్ మన చేతుల్లోంచి వెళ్లిపోయింది. ఇంగ్లండ్తోనూ 170 పరుగుల టార్గెట్ను ఫీల్డింగ్ తప్పిదాల వల్ల కాపాడుకోలేకపోయారు. ఈ వైఫల్యాలు సెమీస్ ఆశలను దెబ్బతీశాయి.
స్పిన్నర్లపై అతిగా ఆధారపడటం, సరైన పేస్ బౌలర్లు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్లపై మన బౌలింగ్ తేలిపోయింది. గ్రూప్ స్టేజ్లో టీమిండియా మొత్తం 34 వికెట్లు తీస్తే, అందులో 29 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. శ్రీ చరణి 12, దీప్తి శర్మ 7, షఫాలీ వర్మ 5, రాధా యాదవ్ 3 వికెట్లు తీశారు. దీన్నిబట్టి స్పిన్పై ఎంతలా ఆధారపడ్డారో తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లపై పేసర్లు వికెట్లు తీయలేకపోయారు. దీంతో పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయలేకపోయారు.
చివరిగా కొందరు స్టార్ బ్యాటర్ల వ్యక్తిగత ప్రదర్శనలపైనే జట్టు ఆధారపడింది. వాళ్లు విఫలమైనప్పుడు మిడిల్ ఆర్డర్ నుంచి సపోర్ట్ కరువైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 56 పరుగులు చేసింది. స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34), జెమీమా రోడ్రిగ్స్ (34) కూడా రాణించారు. కానీ లోయర్-మిడిల్ ఆర్డర్ నుంచి సరైన ఫినిషింగ్ లభించలేదు.
గ్రూప్ స్టేజ్లో జట్టు చేసిన మొత్తం 846 పరుగులలో.. స్మృతి మంధాన (205), షఫాలీ వర్మ (179), హర్మన్ప్రీత్ (141) ముగ్గురే కలిసి 525 పరుగులు చేశారు. అంటే, జట్టు మొత్తం పరుగుల్లో 62.1% వీరివే. ఇది కొందరు సీనియర్లపై జట్టు ఎంతగా ఆధారపడిందో చూపిస్తోంది.