
విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న వీరిద్దరూ ఇవాళ అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. వారు కృష్ణలంక పీఎస్ లో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయానికి అశోక్, జంగం నాని ఓ ఆటోలో వచ్చారు. అనంతరం నేరుగా అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేయగానే... నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాయికృష్ణ మృతి ఘటనలో వీరిపై కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసులోని ఇతర అంశాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. వారిద్దరూ ఈ కేసులో సీఐ నాగరాజుకు సహకరించినట్టు సిట్ గుర్తించింది.