
గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి బీసీ జనార్దన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాయలసీమలో రక్తపుటేరులు పారాయని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని...
ఇక్కడ పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. "రప్పా.. రప్పా.. నరుకుతాం అంటూ ఫ్యాక్షన్ డైలాగులు చెబుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?" అని జగన్ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఆ భయానక వాతావరణం వల్లే గతంలో ఉన్న పరిశ్రమలు కూడా ఏపీని వదిలి పారిపోయాయని మండిపడ్డారు. డెవలప్మెంట్కు ఎప్పుడూ చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు ఈరోజు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వ కార్యాచరణ వల్ల ఎన్నో కొత్త పరిశ్రమలు రాయలసీమకు క్యూ కడుతున్నాయని మంత్రి వెల్లడించారు. కేవలం పరిశ్రమలు మాత్రమే కాకుండా... సీమ ప్రాంతాన్ని ఒక మెగా ‘హార్టికల్చర్ హబ్’ (ఉద్యానవన హబ్) గా మారుస్తున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ ప్రజలే ఆ ‘గొడ్డలి పార్టీ’కి బుద్ధి చెప్పబోతున్నారని, వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.