
భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (Narasimha Rao) జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) పీవీకి ఘనంగా నివాళులర్పించారు.
ఆధునిక భారత నిర్మాణంలో పీవీ నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయమని స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, బహుభాషా కోవిదుడిగా, దూరదృష్టి గల నాయకుడిగా పీవీ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారని రేవంత్రెడ్డి కొనియాడారు. ముఖ్యంగా దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి భారత ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా నడిపించిన మహానేతగా పీవీని కీర్తించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి, భారత అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేతగా పీవీ నరసింహారావు నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ ముద్దుబిడ్డగా పీవీ నరసింహారావు సాధించిన విజయాలు రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమని, ఆయన సేవలు, ఆలోచనలు, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komatireddy Venkat Reddy), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) తదితరులు పాల్గొన్నారు.