
కొత్తగూడెం, జూన్ 29 : దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు పిలుపునిచ్చారు.
సోమవారం అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా కొత్తగూడెం సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, సహకార రంగం అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. సహకార సంఘాల బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రం, దేశం అభివృద్ధిలో రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా రైతులు సహకార భావనతో ముందుకు వచ్చి సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ కె.రామచంద్రరావు, సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.