
ఏపీలో తీవ్ర సంచలనంగా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో... సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు...
తాజాగా ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు.
సాయిష్ణ లాకప్ డెత్ అంశంపై బాబురావును విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి లోతైన విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు. పోలీస్ స్టేషన్ లాకప్లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ టార్చర్లో బాబురావు పాత్ర కూడా ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మరణించాడని తేలడంతో బాబురావును అరెస్ట్ చేశారు.
మరోవైపు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్పై అత్యంత కీలకమైన విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సాయికృష్ణను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు గతంలోనే పోలీసులను ఆదేశించింది.
హైకోర్టు సీరియస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం... ఆ దర్యాప్తులో పోలీసులే సాయికృష్ణను కొట్టి చంపేసి బాడీని మాయం చేశారనే విషయం బయటపడింది. దాంతో అప్పటివరకు కేవలం ‘మిస్సింగ్ కేసు’గా ఉన్న ఈ కేసు.. లాకప్ డెత్ కేసుగా మారింది.