
తిరుమలలో భక్తుల విపరీత రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శుక్రవారం 81,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వారిలో 44,874 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.గోగర్భం డ్యామ్ సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4.42 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అదే స్థాయిలో 3.31 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం విశేష ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునః దర్శనం ఇచ్చారు. మళ్లీ వచ్చే సంవత్సరం జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఇదే బంగారు కవచంతో శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు అభయమిస్తారు.చివరి రోజు ఉత్సవాల సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనం ఇచ్చారు.ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. బంగారు కవచంలో మెరిసిన శ్రీ మలయప్ప స్వామివారిని వేలాదిమంది భక్తులు కనులారా వీక్షించారు. హారతులు పట్టారు. గోవిందుడి నామస్మరణతో తిరుమల ప్రతిధ్వనించిందీ సందర్భంగా. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకి దేవి, సుచిత్ర ఎల్లా, ఆల‌య డిప్యూటీ ఈవో లోకనాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.