Venezuelan Footballer| ఇంటర్నెట్డెస్క్: వెనెజువెలాలో భూకంప విలయం ఎన్నో కుటుంబాల భవిష్యత్ను చిదిమేస్తే.. సరైన సమయంలో సహాయకచర్యలు అందక మరిన్ని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
దాంతో ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూడకుండా ప్రజలే తమవారిని వెతుక్కుంటున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ఫుట్బాలర్ షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. తమ బిడ్డను కాపాడి, భార్య శిథిలాల కింద బలైందని భావోద్వేగానికి గురయ్యారు.
బుధవారం సాయంత్రం వచ్చిన జంట భూకంపాల్లో (Earthquake) తన భార్య ఆండ్రియా బెల్లో ప్రాణాలు కోల్పోయిందని వెనెజువెలా ఫుట్బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తన ఏడాది కుమార్తె అలనాను కాపాడి.. తాను ప్రాణాలు కోల్పోయిందని రాసుకొచ్చారు. ‘‘నువ్వే మా ఫేవరెట్ హీరో. నువ్వు ఎంతటి అద్భుతమైన వ్యక్తివో మన కుమార్తెకు చెప్పి పెంచుతాను. మన బిడ్డ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి చివరిశ్వాస వరకు ఎంతో ధైర్యంగా పోరాడావు. ఆ కథను ఆమెకు చెప్తాను ’’ అంటూ తన భార్యను గుర్తుచేసుకొని ఆవేదన చెందారు.
‘‘నువ్వు ధైర్యంగా ఎదగాలి. ఆ తర్వాత ముక్కలైన నా హృదయాన్ని నువ్వే ఓదార్చాలి. ఇంతకుముందులా మీ నాన్న నవ్వుతూ కనిపించలేకపోవచ్చు. కానీ, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఇప్పుడు నవ్వూనేను మాత్రమే ఉన్నాం. మీ అమ్మకు ఒక నిమిషం మాట్లాడే అవకాశం వచ్చినా.. నీ గురించే చెప్తుందని నాకు తెలుసు’’ అంటూ కుమార్తె భవిష్యత్తు కోసం ఆరాటపడ్డారు.
హెక్టర్ కుటుంబం నివసిస్తోన్న భవనం భూకంపం (Venezuela Earthquake) ధాటికి కూలిపోయింది. సహాయకచర్యల్లో భాగంగా సిమెంట్ దిబ్బలను తొలగించగా.. ఆండ్రియా మృతదేహాన్ని గుర్తించారు. ఏడాది వయసున్న అలనా మాత్రం శిథిలాల కింద సురక్షితంగా కనిపించింది. ఈ ప్రకృతి విపత్తు హెక్టర్ కుటుంబంలో చీకట్లు నింపింది. కుమార్తె ప్రాణాలతో బయటపడటం అతడికి కాస్త ఊరటనిచ్చింది. వెనెజువెలాలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడేందుకు తొలి 72 గంటలే అత్యంత కీలకం. ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. దాంతో ఇప్పుడు జరుగుతోన్న సహాయక చర్యలు అన్నీ మృతదేహాలను వెలికి తీయడానికే. ఎవరైనా ప్రాణాలతో కనిపిస్తే అది అద్భుతమే అవుతుందని సహాయక సిబ్బంది చెప్తున్నారు.
ఇలాంటి సమయంలో తమ వారు ప్రాణాలతో ఉంటారన్న ఆశతో శిథిలాల వద్ద ఆత్మీయుల ఎదురుచూపులు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇల్లు కూలిపోవడంతో తన కుమార్తె, అల్లుడు చనిపోయారని, శిథిలాల నుంచి తామే వారిని బయటకు తీసినట్లు లా గువేరాకు చెందిన ఓ మహిళ మీడియాకు వెల్లడించింది. కొందరు సహాయం చేసేందుకు కాకుండా సెల్ఫీలు దిగేందుకు వస్తున్నారని ఆమె ఆక్రోశం వెళ్లగక్కారు. ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కోరకమైన వేదన నెలకొంది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 1430 మంది ప్రాణాలు కోల్పోగా.. 3200 మంది గాయపడ్డారు. 69 వేల మంది జాడ తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.