Old Currency Notes: చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేయడం ఆ తర్వాత తెచ్చిన రూ.
2000 నోట్లను ఉపసంహరించుకోవడంతో తప్పుడు ప్రచారాలు భారీగా పెరిగాయి. తాజాగా జూన్ 30 తర్వాత 2005 కంటే ముందు ముద్రించిన పాత నోట్లు చెల్లవంటూ ప్రచారం జరుగుతోంది. పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు పని చేయవంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఒక సర్క్యూలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్యాంక్తో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం స్పంధించింది. '2005కి ముందు ముద్రించిన నోట్లను జూన్ 30 తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచీల్లో స్వీకరించరు అంటూ సోషల్ మీడియోలా ఒక తప్పుడు వార్త ప్రచారం జరుగుతోంది. ఆ సమాచారం పూర్తిగా తప్పు. వినియోగదారులు అలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాం. అలాగే ఆ తరహా సందేశాలను ఎవరూ ఇతరులకు పంపవద్దు. అధికారిక ఛానళ్ల నుంచి వచ్చే ధ్రువీకృత సమాచారంపైనే ఆధారపడాలి' అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పష్టం చేసింది. అలాగే #FakeMessageAlert అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది.అలాగే ఈ విషయంపై ప్రభుత్వ రంగ వార్తా సంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ సంస్థ సైతం క్లారిటీ ఇచ్చింది. ' తప్పుడు వార్తలను నమ్మి మోసపోవద్దు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జారీ చేసినట్లు ఓ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2005కి ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 బ్యాంక్ నోట్లు జులై 1, 2026 నుంచి తీసుకోవడం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వార్త పూర్తిగా తప్పు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అలాంటి నోటీసు ఏదీ జారీ చేయలేదు. 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు సైతం చెల్లుబాటులోనే ఉంటాయని ఆర్బీఐ సైతం క్లారిటీ ఇచ్చింది. ధ్రువీకృత సమాచారం కోసం అధికారిక సోర్స్ మాత్రమే నమ్మాలి.' అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కేంద్రంలో ఎన్డీయో నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. ఆ తర్వాత క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 పెద్ద నోట్లను చలామణిలో నుంచి ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే కరెన్సీ నోట్లకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. తాజాగా 2005 ముందు నాటి నోట్లు చెల్లవని ప్రచారం చేస్తున్నారు. అయితే అది పూర్తిగా తప్పుడు సమాచారం అని ప్రజలు గుర్తుంచుకోవాలి.