
తిరుమలలో భక్తుల విపరీత రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
దీనికి తగ్గట్టుగా ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. శుక్రవారం 81,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 44,874 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. గోగర్భం డ్యామ్ సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4.42 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అదే స్థాయిలో 3.31 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.
వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొంటోన్న కారణంగా టీటీడీ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 29న అంటే.. సోమవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎటువంటి సిఫారసు లేఖలను కూడా తీసుకోబోమని తెలిపింది.
అదేవిధంగా ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కూడా సోమవారం రద్దయింది. శ్రీవాణి దర్శన టికెట్లను ఆ ఒక్క రోజు కోసం జారీ కాబోవు. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించవచ్చు. ఈ విషయాన్ని గమనించి భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ దర్శనం కల్పిస్తామని, భక్తులకు ఆందోళనకు గురి కావొద్దరని టీటీడీ కోరింది.