
టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త పదం తెగ హల్చల్ చేస్తోంది. అదే ‘ఏఐ క్యానిబలిజం’. డేటా దొంగతనంలో ఇదొక సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికాకు చెంది
న ప్రముఖ టెక్ సంస్థ ఆంత్రోపిక్, చైనా దిగ్గజం అలీబాబా పై చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ ఏఐ డేటాను అలీబాబా షార్ట్కట్ పద్ధతిలో దొంగిలించిందని ఆంత్రోపిక్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఇష్యూతో అమెరికా అలర్ట్ అయి కఠిన చర్యలు తీసుకుంది.
సాధారణంగా ఏదైనా ఒక పెద్ద టెక్ కంపెనీ కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి, రాత్రింబగళ్లు కష్టపడి, భారీ కంప్యూటింగ్ పవర్తో ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ను తయారు చేస్తుంది. అయితే, కొన్ని కంపెనీలు ఇంత కష్టపడకుండా చాలా ఈజీగా ఆ టెక్నాలజీని సొంతం చేసుకోవాలని చూస్తాయి.
అందుకోసం ఆ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్కు లక్షల, కోట్ల కొద్దీ కష్టమైన ప్రశ్నలు వేసి, ఆ ఏఐ ఇచ్చే బెస్ట్ ఆన్సర్స్ డేటాను దొంగిలిస్తాయి. ఆ డేటాతో తమ ఓన్ ఏఐ మోడల్ను ట్రైన్ చేస్తాయి. దీనినే టెక్ భాషలో ‘ఏఐ క్యానిబలిజం’ అని పిలుస్తున్నారు.
ఈ డేటా చోరీ వెనుక ఉన్న అసలు టెక్నిక్ పేరు అడ్వర్సేరియల్ డిస్టిలేషన్ ఎటాక్. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఏఐని కాపీ కొట్టడానికి వాడే ఒక స్మార్ట్ అండ్ చీప్ షార్ట్కట్.
ఏదైనా ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ను టార్గెట్ చేసి, దానికి వరుసగా ప్రశ్నలు వేస్తూ, దాని ఆలోచనా విధానాన్ని, డెసిషన్ మేకింగ్ పవర్ను, కోడింగ్ను ఈజీగా కాపీ చేస్తారు. దీనివల్ల దాడి చేసిన కంపెనీకి కోట్ల డాలర్ల ఖర్చు మిగులుతుంది, ఎలాంటి కష్టం లేకుండా సూపర్ ఏఐ మోడల్ రెడీ అయిపోతుంది. అలీబాబాకు చెందిన క్యువెన్ ఏఐ ల్యాబ్ తమ క్లాడ్ ఏఐ పై చరిత్రలోనే అతిపెద్ద డిస్టిలేషన్ ఎటాక్ చేసిందని ఆంత్రోపిక్ చెప్తోంది.
అమెరికా సెనెట్ విచారణకు సరిగ్గా కొద్దిగా ముందు, ఆంత్రోపిక్ కంపెనీ అమెరికా ఎంపీలకు ఒక లేఖ రాసింది. అందులో షాకింగ్ నిజాలు బయటపెట్టింది. 2026 ఏప్రిల్ 22 నుంచి జూన్ 5 మధ్య, అంటే కేవలం ఆరు వారాల టైమ్లోనే అలీబాబాతో లింక్ ఉన్న వ్యక్తులు దాదాపు 25,000 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు.
ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా క్లాడ్ ఏఐని ఏకంగా 2 కోట్ల 88 లక్షల సార్లకు పైగా ప్రశ్నలు అడిగి డేటాను లాగేశారు. ఏఐ హిస్టరీలోనే ఇది అతిపెద్ద దాడి అని ఆంత్రోపిక్ వాపోతోంది. ఒక్క అలీబాబా మాత్రమే కాదు.. 2026 ఫిబ్రవరిలో మరికొన్ని చైనా ల్యాబ్స్ కూడా ఇలాంటి పనులు చేశాయని ఆంత్రోపిక్ తెలిపింది.
• మినీమాక్స్ : 1.3 కోట్లకు పైగా ప్రశ్నలు-సమాధానాలు
• మూన్షాట్ ఏఐ : 34 లక్షలకు పైగా ప్రశ్నలు-సమాధానాలు
• డీప్సీక్ : సుమారు 1.5 లక్షల ప్రశ్నలు-సమాధానాలు
అమెరికా కంపెనీల నుంచి డేటా దొంగిలించడానికి చైనా ఈ షార్ట్కట్ ఎందుకు ఎంచుకుందనే దానికి టెక్ ఎక్స్పర్ట్స్ ఒక రీజన్ చెప్తున్నారు. అమెరికా ప్రభుత్వం చైనాపై ఏఐ చిప్స్, కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో కఠినమైన ఆంక్షలు విధించింది.
దీనివల్ల చైనా కంపెనీలు సొంతంగా పెద్ద ఏఐ మోడల్స్ను బిల్డ్ చేయలేకపోతున్నాయి. అందుకే అమెరికా కంపెనీల ఏఐ మోడల్స్ నుంచి డేటాను కొట్టేసి, వాటితో తమ ఏఐకి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాయి. తాము పడ్డ కష్టాన్ని చైనా కంపెనీలు ఇలా దొంగిలించడంపై అమెరికన్ టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వ్యవహారం బయటపడటంతో అమెరికా ప్రభుత్వం వెంటనే యాక్షన్లోకి దిగింది. అమెరికా వాణిజ్య శాఖ రంగంలోకి దిగి, ఆంత్రోపిక్ కంపెనీకి చెందిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ మైథోస్, ఫేబుల్ గ్లోబల్ యాక్సెస్పై ఆంక్షలు విధించింది. చైనా సైన్యం లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వీటిని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, అమెరికా రక్షణ శాఖ అలీబాబాను చైనా సైనిక కంపెనీల బ్లాక్లిస్ట్లో చేర్చింది. ఈ బ్యాడ్ న్యూస్ రావడంతో అలీబాబా షేర్లు మార్కెట్లో 3 శాతం వరకు కుప్పకూలాయి. ఏఐ ప్రపంచంలో సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ అనేదానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణగా నిలిచింది.