
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వైఖరి, ఆ పార్టీ అనుసరించిన విధానాలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మంగళగిరిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు తనను టార్గెట్ చేయడం పట్ల పవన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన శైలిలో చురకు అంటించారు. తనకు వైసీపీతో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని పవన్ పేర్కొన్నారు.
అయితే ప్రజా సమస్యలపై, ఆ పార్టీ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలపై తాను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు తనపై పదేపదే వ్యక్తిగత విమర్శలకు దిగారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి ఘోర పరాజయాన్ని అందించి, కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినప్పటికీ వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. అధికారం పోయినా సరే ఇంకా పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తున్నారని ఆయన తప్పుబట్టారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర పురోభివృద్ధిని, మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. కేవలం పథకాల పేరుతో బటన్లు నొక్కితే చాలు.. ప్రజలు ఓట్లు వేసేస్తారనే భ్రమలో వైసీపీ నాయకత్వం బతికిందని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. అభివృద్ధిని విస్మరించి, కేవలం బటన్ల నొక్కుడు రాజకీయాలనే నమ్ముకోవడం వల్లే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.