TN Minister Sarathkumar Controversy : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వివాదం రేగింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డి.
శరత్కుమార్ డ్రగ్స్ ఆరోపణల ఉచ్చులో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన కొన్నేళ్ల క్రితం నాటి ఓ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ స్క్రీన్పై ఏటీఎం కార్డుతో పౌడర్ చేయడం ఆ వీడియోలో ఉండగా.. ఆయన డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తాజాగా మంత్రి శరత్ కుమార్ స్పందించారు. అవి డ్రగ్స్ కాదని.. తన కుమార్తె మెడిసిన్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. వివాదానికి కారణమైన ‘థగ్ లైఫ్’ వీడియోవైరల్ అవుతున్న ఆ వీడియోలో.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా మంత్రి శరత్కుమార్ మొబైల్ స్క్రీన్పై ఒక తెల్లటి పౌడర్ లాంటి పదార్థాన్ని ఉంచి, ఏటీఎం కార్డుతో దానిని పొడి చేస్తూ కనిపించారు. పక్కనే రూ. 500 నోటు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయన తన సన్నిహితుల కోసం మాత్రమే ఉద్దేశించిన ఇన్స్టాగ్రామ్ క్లోజ్ ఫ్రెండ్స్ స్టోరీలో ‘థగ్ లైఫ్’ అనే శీర్షికతో దీనిని పంచుకున్నారు. అయితే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ‘స్టార్ట్ రన్, స్టాప్ డ్రగ్’ పేరిట భారీ మారథాన్ నిర్వహించిన రోజే ఈ పాత వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీంతో మంత్రి వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి.కూతురి అనారోగ్యం వల్లే ట్యాబ్లెట్ పౌడర్ చేశా: మంత్రి శరత్కుమార్ఆరోపణలు తీవ్రమవ్వడంతో మంత్రి శరత్కుమార్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి ఉన్న వీడియోను విడుదల చేస్తూ సంచలన క్లారిటీ ఇచ్చారు. "రెండేళ్ల క్రితం నా కుటుంబం, స్నేహితులతో కలిసి చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాను. అప్పుడు నా చిన్న కుమార్తె వయసు కేవలం ఏడాదిన్నర మాత్రమే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాపకు తీవ్ర అనారోగ్యంగా అనిపించింది. దాంతో వైద్యుల సలహా మేరకు లిక్విడ్లో కలిపి ఇవ్వడం కోసం ఒక ట్యాబ్లెట్ను అలా ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్పై పౌడర్గా మార్చాను. రాజకీయ దురుద్దేశాలతోనే కొందరు కావాలని ఆ పాత వీడియోను ఇప్పుడు తప్పుగా ప్రచారం చేస్తున్నారు" అని శరత్కుమార్ స్పష్టం చేశారు.సీఎం విజయ్ను టార్గెట్ చేసిన ప్రతిపక్షం..మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ.. ప్రతిపక్ష డీఎంకే ఈ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా సీఎం విజయ్ను నేరుగా టార్గెట్ చేశారు. "ముఖ్యమంత్రి విజయ్ ఒకవైపు మత్తుపదార్థాల నిర్మూలన కోసం స్వయంగా మారథాన్లలో పాల్గొంటూ పోరాడుతున్నారు. మరి అదే తరుణంలో తన మంత్రివర్గ సహచరుడిపై వస్తున్న ఇలాంటి తీవ్రమైన ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? ప్రజల మనసుల్లో ఉన్న ఈ అనుమానాలను ప్రభుత్వం అలాగే వదిలేయకూడదు" అంటూ ఆయన డిమాండ్ చేశారు.