
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (జూన్ 2) మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు, పలు అభివృద్ధి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (జూన్ 2) మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం 9:55 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం చంద్రబాబు, 10:45 గంటలకు మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం, ఉదయం 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆయన పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:20 వరకు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:55 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవిని ఆసుపత్రిని ప్రారంభించి, వైద్యులు, సిబ్బందితో సమావేశమవుతారు.ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో 'గార్డెన్ మీటింగ్'లో పాల్గొని అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 5:15 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు తిరుగుపయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.