
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సందడి మందగించింది. వాటి రాక ఆలస్యం కావడం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఇప్పటికే దీని ప్రభావం పడింది కూడా.
315 జిల్లాల్లో సగటు కంటే 43 శాతం లోటు వర్షం కురిసింది. జూలై 2వ తేదీ నాటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం.. ఎల్ నినో.
ఈ పరిస్థితుల్లో ఐఎండీ తీపికబురు ఇచ్చింది. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ, ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. సాధారణంగా ఇటువంటి వాతావరణ మార్పులు రుతుపవనాల పురోగతికి ఊతం ఇవ్వొచ్చు.
వాతావరణ విభాగం అందించిన తాజా వివరాల ప్రకారం.. ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో జూలై 2వ తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం బలపడనుంది. ఆ తర్వాత 3, 4వ తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో ఉత్తర ప్రాంతం వైపు కదులుతుంది. క్రమంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావం.. తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీతో పాటు గ్లోబల్ ఫోర్ క్యాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మిడ్ రేంజ్ ఫోర్ క్యాస్ట్ వెల్లడించాయి. 5వ తేదీ నాటికి అల్పపీడనం మరింత బలపడి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే ముప్పు కూడా పొంచి ఉందని పేర్కొన్నాయి. ఈ అల్పపీడనం నిర్దుష్టంగా ఏ ప్రాంతం మీదుగా పయనిస్తుంది, దీని తీవ్రత ఏ మేరకు ఉంటుంది, ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై మరింత స్పష్టత అవసరమని తెలిపాయి.
ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారేందుకు 30 శాతం మాత్రమే అవకాశం ఉంది. దీని వల్ల కురిసే వర్షాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సాగు పనులకు ఎంతగానో మేలు చేకూరుస్తాయనే అంచనాలు ఉన్నాయి. జూన్ లో వర్షపాత లేమితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మెట్ట పంటల రైతులకు జూలై మొదటి వారంలో కురిసే ఈ వర్షాలు నూతన ఆశలను కల్పించనున్నాయి. ముఖ్యంగా నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ వర్షపాతం భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.