
రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఉద్యోగుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడి, చిరాకు రోజంతా వెంటాడుతూ సహోద్యోగులతో వ్యవహరించే తీరును కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.ఇండియానాపోలిస్లోని కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రోజూ సుదీర్ఘ ప్రయాణం చేస్తే ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. ఈ ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ’లో ప్రచురితమయ్యాయి.ట్రాఫిక్ రద్దీ, ఆకస్మిక బ్రేకులు, ప్రమాదకర డ్రైవింగ్, రోడ్డు పనుల వంటి చిన్న చిన్న ఇబ్బందులు మనసులో చిరాకును పెంచుతాయి. ఆ చిరాకు ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహారంలో కూడా ప్రతిబింబిస్తుందని పరిశోధకులు తెలిపారు.చాలామందికి తమ అసహనానికి కారణం ప్రయాణమనే విషయం కూడా తెలియదని అధ్యయనం పేర్కొంది. దీంతో ఆ కోపాన్ని చుట్టుపక్క వారిపై చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.80 మందికి పైగా పూర్తి స్థాయి ఉద్యోగులపై 15 రోజులపాటు అధ్యయనం నిర్వహించారు. ఆఫీసుకు వెళ్లే ముందు, తర్వాత వారి స్పందనలను పరిశీలించగా ప్రయాణ ఒత్తిడి నేరుగా పనితీరు, ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నట్లు తేలింది.ప్రయాణం తర్వాత కొద్దిసేపు మనసును శాంతపరిచే అలవాట్లు, లోతైన శ్వాస వ్యాయామాలు, పని ప్రారంభించే ముందు చిన్న విరామం తీసుకోవడం వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయని పరిశోధకులు సూచించారు.