
ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక పదవిలో తెలుగు క్యాడర్ అధికారి నియమితులవ్వడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత...
ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక పదవిలో తెలుగు క్యాడర్ అధికారి నియమితులవ్వడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. మహేశ్ దీక్షిత్ కు దేశ రక్షణ వ్యూహాలను రచించడంలో దశాబ్దాల అనుభవం ఉంది. 1993 బ్యాచ్కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేశ్ దీక్షిత్ తన కెరీర్లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే పని చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఆయన పని చేశారు. ఐబీలో జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ వంటి హోదాల్లో పనిచేస్తూ దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత విశ్వసనీయమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మహేశ్ దీక్షిత్ కెరీర్లో జమ్మూ కశ్మీర్ పని చేసిన కాలం అత్యంత కీలకంగా చెప్పవచ్చు. శ్రీనగర్లోని ఐబీ అనుబంధ విభాగం చీఫ్గా పనిచేసిన సమయంలో ఆయన జమ్మూ, కశ్మీర్, లేహ్ ప్రాంతాల భద్రతా కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో కశ్మీర్ లోయలో శాంతిభద్రతలను కాపాడటంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం తలెత్తిన అల్లర్లను అణచివేయడం, సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లను అడ్డుకోవడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేయడంలో ఆయన సమర్థవంతంగా పని చేశారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నెట్వర్క్లను ఛేదించడంలో ఆయన చూపిన చొరవ భద్రతా వర్గాలలో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.
ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాలపై మహేశ్ దీక్షిత్కు పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాద నెట్వర్క్లపై నిఘా ఉంచడంలో, వారి స్లీపర్ సెల్స్ కార్యకలాపాలను ముందే గుర్తించి భగ్నం చేయడంలో ఆయనకు క్షేత్రస్థాయి అనుభవం ఉంది. అదే ఇప్పుడు ఆయనకు ఐబీ చీఫ్ పదవి దక్కేలా చేసింది. 2022లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అదనపు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ దీక్షిత్, ఆ తర్వాత 2024 సెప్టెంబర్లో స్పెషల్ డైరెక్టర్గా పదొన్నతి పొందారు. ఇప్పుడు దేశ ఐబీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
మురుగునీటి పునర్వినియోగ విధానానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జల భద్రత దిశగా కీలక ముందడుగు
.