
వధువు కుటుంబంతో వరుడి వాగ్వాదం, జిల్లా కలెక్టర్తో సమావేశమైన ముస్కాన్ ఈటీవీ భారత్: మూడుముళ్లు పడే ముందు కాబోయే జీవిత భాగస్వామి గురించి కొన్ని చేదునిజాలు తెలిసినా..
కుటుంబ పరువు గురించి ఆలోచించి ‘తలరాత’ అని సరిపెట్టుకునే యువతులను చాలా కుటుంబాల్లో చూస్తుంటాం. ఛత్తీస్గఢ్లోని జాంజగీర్ చాంపా జిల్లాకు చెందిన ముస్కాన్ ప్రధాన్ (22) అనే యువతి మాత్రం ఎదురుతిరిగి తన జీవితాన్ని నిలబెట్టుకొంది. ఈ నెల 23వ తేదీ రాత్రి కోస్మాండా గ్రామంలోని ముస్కాన్ ఇంటికి వరుడి ఊరేగింపు వచ్చింది. కారు దిగిన వరుడు మద్యం మత్తులో కనీసం నిలబడలేకపోతున్నాడు. ఈ విషయం ఇంట్లో ఉన్న వధువు ముస్కాన్ చెవినపడింది.
తాగుడు కారణంగా చిన్నవయసులోనే తండ్రిని పోగొట్టుకొన్న ముస్కాన్ పరుగున గడప దాటొచ్చి వరుడి చెంప ఛెళ్లుమనిపించింది. అతడితో పెళ్లి ససేమిరా వద్దంటూ తేల్చి చెప్పింది. ఆమె నిర్ణయానికి కుటుంబసభ్యులు కూడా మద్దతు పలకడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగి కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు జోక్యం చేసుకొని పెళ్లి ఊరేగింపును వెనక్కు పంపారు. జిల్లా ఎస్పీ విజయ్కుమార్ పాండే.. ముస్కాన్ను సత్కరించి, రూ.5,000 గౌరవ వేతనంతో కౌన్సెలరుగా నియమించారు. జిల్లా కలెక్టర్ జనమేజయ్ మహోబే సైతం అభినందించి.. పదో తరగతితో ఆగిపోయిన ముస్కాన్ చదువు కొనసాగేందుకు సహకరిస్తామని, కుటుంబానికి ప్రభుత్వ పథకాలు మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.