
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Pay Revision Commission: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగ వర్గాలు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై తెలంగాణ సీఎం కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీని ఇస్తామని ప్రకటన చేశారు. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ వాయిదా పడుతుండగా.. ఈ క్రమంలో తాజాగా అప్డేట్ రావడంతో ఉద్యోగ వర్గాలు ఆశాభావంలో ఉన్నారు.
ఆరోగ్య బీమా ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణ అంటే నమ్మకం.. ఉద్యోగులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత తీసుకోవడం అంటే భద్రత. ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి బీమా సొమ్ము అందించాం. వారి మాదిరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమాను అమలు చేస్తున్నాం' అని తెలంగాణ సీఎం తెలిపారు.
నేను గుంపు మేస్త్రీనే 'ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇస్తుంది. ఉద్యోగుల భద్రత యజమానిదే… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందిచేందుకు ఇవాళ బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'కొందరు నన్ను గుంపుమేస్త్రీ అని అవహేళన చేస్తుంటారు. ఎవరు ఎలా మాట్లాడినా.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు' అని చెప్పుకొచ్చారు.
నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం 'నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమే. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. మీకు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి.. చర్చించుకుని పరిష్కరించుకుందామని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు.
ఆదాయం పెంచండి 'రోజుకో గంట ఎక్కువ పనిచేయండి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచండి. పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తాం' అని ఉద్యోగులకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ప్రకటించారు. 30 నెలలుగా తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా తాను పదే పదే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ పని చేయండి 'నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే రోజుకు ఒక గంట ఎక్కువ పని చేయండి. మార్పు తీసుకొద్దాం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఎదగాలంటే మీ అందరి సహకారం అవసరం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.