తెలంగాణలో రేపటి (జూన్ 25వ తేదీ) నుంచి ఓటర్ల జాబితా సవరణ ( ఎస్ఐఆర్ ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయింది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నేతలను క్షమించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. పనిచేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్ఐఆర్ గురించి.. గ్రామాల్లో సర్పంచ్లతో ప్రచారం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పనిచేయని వారికి 10 రోజుల సమయం ఇచ్చి చూస్తామని.. అయినప్పటికీ వారి పనితీరు మారకపోతే వారి స్థానంలో ఇంకొక వ్యక్తిని నియమిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రారంభం కానుండటంతో కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులు, బూత్ స్థాయి నేతలు అలర్ట్గా ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ఓటర్ల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. ఓటర్ జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని.. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న రాజకీయ వ్యూహాలను గమనించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన మహేష్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యులర్ ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగే ప్రమాదం ఉందని.. ప్రతీ అర్హత కలిగిన ఓటర్ల జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడకపోతే ఎంత పెద్ద నేతలైనా కఠిన నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఇది కేవలం కిందిస్థాయి నేతలు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా.. ఇంఛార్జ్ మంత్రులకు కూడా తాజా వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి గట్టి సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది. ఇంఛార్జ్ మంత్రులు కూడా సర్పై పూర్తి బాధ్యత తీసుకోవాలని.. లేకపోతే వారిని కూడా మార్చేస్తామని హింట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.