
బాలీవుడ్ 'కింగ్ ఖాన్', 'బాద్షా', 'ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు'... షారుఖ్ ఖాన్కు ఇలాంటి బిరుదులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ముంబైలోని 'మన్నత్' అనే రాజభవనంలో నివసిస్తున్న షారుఖ్.. కోట్లాది మంది
అభిమానులకు ఆరాధ్య దైవం. కానీ, ఆయన విలాసవంతమైన జీవితం వెనుక ఎవరూ ఊహించలేని కన్నీటి కథ, కఠోర శ్రమ ఉన్నాయి. ఒకప్పుడు ఇదే సూపర్ స్టార్ ఢిల్లీ వీధుల్లో సమోసాలు అమ్ముకున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల సీనియర్ నటుడు పంకజ్ కపూర్ పంచుకున్న ఒక జ్ఞాపకం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1970లలో పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటులు ఢిల్లీలోని 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా' (NSD)లో నటన నేర్చుకుంటున్నారట. ఆ సమయంలో క్యాంటీన్కు వేడి వేడి సమోసాలు తీసుకువచ్చే ఒక చిన్న కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించేవాడట. ఆ కుర్రాడు మరెవరో కాదు, నేటి గ్లోబల్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.
షారుఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ ఢిల్లీలో 'ఖతిర్' పేరుతో ఒక చిన్న రెస్టారెంట్ నడిపేవారు. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో, షారుఖ్ చిన్న వయసులోనే తండ్రికి పనుల్లో సహాయం చేసేవాడు. రెస్టారెంట్లో చేసిన సమోసాలను బుట్టలో పెట్టుకుని ఎన్ఎస్డీ క్యాంటీన్కు చేరవేయడం ఆయన పని. అప్పట్లో పెద్ద పెద్ద కళాకారులు సమోసాలు తింటూ నాటకాల గురించి చర్చిస్తుంటే, ఈ కుర్రాడు దూరం నుంచి వాళ్లనే ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాడట. అప్పుడు సమోసాలు ఇచ్చిన కుర్రాడే, భవిష్యత్తులో అదే నటులతో స్క్రీన్ పంచుకుంటాడని ఎవరూ ఊహించలేదు!
1992లో 'దీవానా' చిత్రంతో షారుఖ్ ఖాన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఎలాంటి గాడ్ఫాదర్ లేరు. అప్పటి సూపర్ స్టార్ రిషి కపూర్ ముందు నటించడం అంత సులభం కాదు. కానీ షారుఖ్ తన కళ్లలోని కసితోనే ప్రేక్షకులను గెలుచుకున్నాడు. ఆ తర్వాత 'బాజీగర్', 'డర్' లాంటి సినిమాల్లో విలన్గా కనిపించి మ్యాజిక్ చేశాడు. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'తో ప్రేమకథా చిత్రాలకు రారాజుగా మారిపోయాడు.షారుఖ్ ఖాన్ కథ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎక్కడికి చేరుకోవాలనే పట్టుదల ముఖ్యం. అప్పట్లో సమోసాలు అమ్ముకున్న కుర్రాడు, ఈ రోజు అక్షరాలా 6000 కోట్లకు పైగా ఆస్తికి అధిపతి.