
ఏలూరు జిల్లా పోలవరం మండలం, పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో ఒక పెద్దపులి సంచరిస్తుండటం స్థానిక ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో, తాజాగా ఉప్పారేల్లి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు స్పష్టంగా కనిపించడంతో అటవీశాఖ అప్రమత్తమైంది.
పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదిలో పర్యాటక బోట్ల రాకపోకలను, అలాగే స్థానిక మత్స్యకారుల చేపల వేటను తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేశారు. పెద్దపులి ప్రస్తుతం ఉప్పారేల్లి ప్రాంతంలో తిరుగుతుండటంతో... ముంజులూరు, కోటూరుపల్లి, వీరన్నపాలెం, చింతలగూడెం, దండిపూడి సహా చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలను అటవీశాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఆయా గ్రామాల్లో మైకులు, దండోరా ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, చెరువుల వద్దకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పశువులను ఆరుబయట కట్టేయకుండా, పాకల్లో ఉంచి రాత్రి వేళల్లో లైట్లు వేసి ఉంచాలని గైడ్లైన్స్ ఇచ్చారు.