Bengaluru Metro Purple Line Snag : భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో మౌలిక వసతుల లోటు మరోసారి బయటపడింది.
మంగళవారం సాయంత్రం పీక్ అవర్స్లో ‘నమ్మ మెట్రో’ పర్పుల్ లైన్లో తలెత్తిన ఊహించని సాంకేతిక లోపం.. వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డుపై నిలబెట్టింది. మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ రవాణా దొరకక.. ఇళ్లకు వెళ్లేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏకంగా టిప్పర్ లారీలు, గూడ్స్ ట్రక్కులు ఎక్కి ప్రయాణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై పౌరుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుండగా.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ "ఫస్ట్ వరల్డ్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్" అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.కబ్బన్ పార్క్ వద్ద బ్రేక్డౌన్.. స్తంభించిన ఐటీ కారిడార్మెట్రో అధికారుల సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో పర్పుల్ లైన్లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఒక రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. వైట్ఫీల్డ్ ఐటీ కారిడార్ను నగరంలోని కీలక ప్రాంతాలతో అనుసంధానించే ఈ లైన్ నిలిచి పోవడంతో.. పీక్ అవర్స్లో ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వేలాది మంది టెక్కీలు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. రైళ్లలో ఉన్న ప్రయాణికులను కూడా దిగిపోవాలని అధికారులు కోరడంతో.. వారంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఆటోలు, క్యాబ్ల మెండిచేయితో లారీలు, ట్రక్కులు ఎక్కిన టెక్కీలు..మెట్రో సేవలు ఆగిపోవడంతో రోడ్లపైకి వచ్చిన ప్రయాణికుల రద్దీని తట్టుకోవడంలో క్యాబ్లు, ఆటో సేవలు పూర్తిగా విఫలం అయ్యాయి. డిమాండ్ పెరిగిపోవడంతో ఓలా, ఉబెర్ యాప్లలో విపరీతమైన సర్జ్ ఛార్జీలు చూపించగా.. ఆటో డ్రైవర్లు రైడ్లు నిరాకరించారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేరే మార్గం లేక తీవ్ర నిరాశకు గురైన ఐటీ నిపుణులు, కష్టపడి పనిచేసే ఉద్యోగులు రోడ్డుపై వెళ్లే లారీలు, ఓపెన్ ట్రక్కులను ఆపి, వాటిపైకి ఎక్కి ప్రయాణించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ వరల్డ్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్ అంటూ..!ఈ దారుణ పరిస్థితులపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "మొదటి ప్రపంచ దేశాల స్థాయి టెక్ టాలెంట్.. మూడో ప్రపంచ దేశాల స్థాయి పాలన.. ఇదే నేటి బెంగళూరు కథ. మెట్రో అంతరాయాలు ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయాయి. మెట్రో ఫెయిల్ అయిన ప్రతిసారీ నగరం అంధకారంలోకి వెళ్తుంది. ఐటీ కారిడార్లోని వృత్తి నిపుణులు లారీలు ఎక్కి ఇళ్లకు వెళ్లాల్సి రావడం సిగ్గుచేటు. వీరంతా రేపు ఉదయం మళ్లీ లేచి, ఆఫీసుకెళ్లి, నిజాయితీగా పన్నులు కట్టి, అదే విరిగిపోయిన వ్యవస్థను మళ్లీ భరిస్తారు" అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.మెట్రో సిబ్బంది రాత్రంతా శ్రమించి బుధవారం తెల్లవారుజామున 5 గంటల కల్లా సాంకేతిక లోపాన్ని పూర్తిగా సరిదిద్ది, సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రతి చిన్న సమస్యకు నగరం మొత్తం స్తంభించిపోతుండటంపై బెంగళూరు వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.