
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన వేగంగా పుంజుకుంటున్న తరుణంలో ఇసుక కొరత, ఇసుక విధానాలపై సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పునకు, రాజకీయ జయాపజయాలకు ఇసుక ఒక ముఖ్యమైన పారామీటర్గా మారుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ సంచాలకుడు, ప్రముఖ ఖనిజరంగ పరిశోధకుడు డాక్టర్ వి.డి. రాజగోపాల్ విశ్లేషించారు. ఇంటలెక్చ్యువల్ టాక్ షో విత్ తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇసుక సంక్షోభం, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన సంచలన విషయాలు చెప్పారు.
నదుల నుండి ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయని డాక్టర్ రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక పొరలు నీటిని నిల్వ ఉంచే స్పాంజ్లా పనిచేస్తాయని, వాటిని పూర్తిగా తొలగిస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని నదీ గర్భాల్లో విపరీతమైన డ్రెడ్జింగ్ జరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, వాల్టా నిబంధనలను పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ గండి పడుతోందని ఆయన గణాంకాలతో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక ద్వారా దాదాపు రూ. 1000 కోట్ల ఆదాయం పొందుతుండగా, ఏపీలో ఉచిత విధానం వల్ల సుమారు రూ. 1500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానా నష్టపోతోందని డాక్టర్ వీడీ రాజ్ గోపాల్ అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ అటు ప్రజల్లో గానీ, ఇటు నిర్మాణ రంగంలో గానీ పూర్తిస్థాయి సంతృప్తి కనిపించడం లేదని, ఇసుక లభ్యతపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోందని విశ్లేషించారు.
నదులను కాపాడుకుంటూనే నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడానికై బెంగళూరు మోడల్ ను తెలుగు రాష్ట్రాలు అనుసరించాలని డాక్టర్ రాజగోపాల్ సూచించారు. కర్ణాటకలో భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నప్పటికీ, అక్కడ నదీ ఇసుక పై ఆధారపడటం తగ్గించి.. పూర్తిస్థాయిలో మాన్యుఫ్యాక్చర్డ్ సాండ్ లేదా రాక్ సాండ్ ) వినియోగాన్ని ప్రోత్సహించి విజయం సాధించారని వీడీ రాజ్ గోపాల్ చెప్పారు. భవిష్యత్తు అంతా రాక్ సాండ్దేనని, ఈ దిశగా ప్రభుత్వాలు గట్టి విధానాలు తీసుకురావాలన్నారు.
రాజధాని అమరావతి చుట్టుపక్కల 15 నుండి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఇసుక తయారీకి అనువైన అనేక కొండలు ఉన్నాయని, వాటిని గుర్తించి క్రషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఇసుక కోసం వినియోగదారుల నేరుగా క్రషింగ్ యూనిట్ల చుట్టూ తిరగకుండా, నగరాల్లోని పెట్రోల్ బంకుల తరహాలోనే సాండ్ బంకర్స్ లేదా ప్రత్యేక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. ఐఏఎస్ అధికారులకు కూడా ఖనిజ సంపద, మైనింగ్ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
నదులపై భారాన్ని తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. వరదలు లేని సమయంలో నదీ గర్భాలను క్షుణ్ణంగా పరిశీలించి, జియో కోఆర్డినేట్స్, నిర్దిష్ట లెవెల్స్ ఆధారంగా మాత్రమే మైనింగ్ బిట్లను కేటాయించాలని, ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తవ్వకుండా కఠిన నిబంధనలు పెట్టాలని వీడీ రాజ్ గోపాల్ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేలా దీర్ఘకాలిక ఇసుక విధానాన్ని రూపొందించడమే తక్షణ పరిష్కారమని డాక్టర్ రాజగోపాల్ తేల్చిచెప్పారు.
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
.