
ఇటీవల వైసీపీ నిర్వహించిన కాపుల సమావేశాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది కాపుల ఆత్మీయ సభ కాదని..
కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ నిరుద్యోగులు పెట్టుకున్న 'ఆర్తనాద సభ' అని ఎద్దేవా చేశారు.
విజయవాడ సాయికృష్ణ కేసుతో పాటు ఇటీవల జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని సానా సతీశ్ మండిపడ్డారు. "నేరం చేసిన ఏ నేరస్థుడికైనా కులం రంగు పులమొద్దని, చట్టప్రకారం చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ మాటలను మార్చేసి జగన్ అండ్ కో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతూ సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత టీడీపీ హయాంలో చంద్రబాబు కాపులకు 5 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే... జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారని గుర్తుచేశారు. "అసలు కాపులపై జగన్కు నిజమైన ప్రేమ ఉందా? గతంలో కాకినాడ నడిబొడ్డున నిలబడి.. 'కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను' అని జగన్ బాహాటంగా చెప్పలేదా? ఇప్పుడు కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఎద్దేవా చేశారు.
ప్రతి చిన్న విషయాన్ని జగన్ అండ్ కో రాజకీయం చేస్తోందని, చివరకు ఎవరైనా చనిపోతే శవం వద్దకు వెళ్లి కూడా అది ఏ కులమని అడిగి మరీ రాజకీయ లాభం కోసం చూస్తారని సానా సతీశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.