
Vaibhav Sooryavanshi T20 Debut: 26 జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్న భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్లో అందరి కళ్ళు ఒకే ఒక్కరిపైనే ఉన్నాయి.
కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమ్ ఇండియా పిలుపు అందుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి కౌంట్డౌన్ మొదలైంది. ఈ సిరీస్లో వైభవ్ బరిలోకి దిగితే, ఐర్లాండ్ గడ్డపై టీ20 అరంగేట్రం చేసిన భారత క్రికెటర్ల సరసన నిలవడమే కాకుండా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ పర్యటన ఎంతోమంది యువ ఆటగాళ్లకు వరంగా మారింది. ఇప్పటివరకు నలుగురు భారత ఆటగాళ్లు ఐర్లాండ్ మైదానాల్లోనే తమ తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. ప్రస్తుత సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కితే, ఐర్లాండ్ గడ్డపై అరంగేట్రం చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు. అలాగే టీమ్ ఇండియా తరపున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించిన 120వ ఆటగాడిగా వైభవ్ సరికొత్త మైలురాయిని అందుకోనున్నాడు.
అయితే, గతంలో ఐర్లాండ్లో అరంగేట్రం చేసిన మిగతా నలుగురు భారత ఆటగాళ్లకు, వైభవ్ సూర్యవంశీకి మధ్య ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. గతంలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లంతా డబ్లిన్ నగరంలోని మైదానంలో తమ మొదటి మ్యాచ్ ఆడగా, వైభవ్ మాత్రం బెల్ఫాస్ట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. బెల్ఫాస్ట్ మైదానంలో టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్న తొలి భారతీయ క్రికెటర్గా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఇదే అతడి అరంగేట్రాన్ని అందరికంటే భిన్నంగా, అత్యంత ప్రత్యేకంగా మారుస్తోంది.
సిద్ధార్థ్ కౌల్ (2018): ఐర్లాండ్లో టీ20 అరంగేట్రం చేసిన మొదటి భారత ఆటగాడిగా ఈ ఫాస్ట్ బౌలర్ నిలిచాడు. 2018 పర్యటనలో డబ్లిన్ వేదికగా జరిగిన మ్యాచ్లో సిద్ధార్థ్ భారత్ తరపున 75వ ఆటగాడిగా బరిలోకి దిగాడు.
ఉమ్రాన్ మాలిక్ (2022): తన బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ 2022లో డబ్లిన్ వేదికగానే టీమ్ ఇండియా తరపున 98వ ఆటగాడిగా టీ20ల్లోకి అడుగుపెట్టాడు.
ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్ (2023): 2023 ఐర్లాండ్ పర్యటనలో డబ్లిన్ వేదికగా జరిగిన ఒకే మ్యాచ్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకేసారి అరంగేట్రం చేశారు. వీరు భారతదేశం తరపున టీ20 ఆడిన 106వ, 107వ ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు.