
ఆర్బీఐ నేడు బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నగదును విడుదల చేసింది. ఏడు రోజుల వీఆర్ఆర్ (వేరియబుల్ రేట్ రెపో) వేలం ద్వారా రూ.1.41 లక్షల కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసింది.
జీఎస్టీ చెల్లింపుల కారణంగా వ్యవస్థలో ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది.ఇటీవలి జీఎస్టీ చెల్లింపుల వలన బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు బయటకు వెళ్లింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత ఒక్కసారిగా పడిపోయింది. జూన్ 21న రూ.30,685 కోట్ల మిగులుతో ఉన్న వ్యవస్థ, జూన్ 22 నాటికి రూ.19,971 కోట్ల లోటుకు చేరుకుంది. ఈ పరిణామంతో స్వల్పకాలిక మనీ మార్కెట్ వడ్డీ రేట్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. సగటు కాల్ మనీ రేటు 5.43 శాతానికి చేరింది. ఇది ఆర్బీఐ రెపో రేటు కన్నా 0.18 శాతం ఎక్కువ.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్బీఐ, వ్యవస్థలో తగినంత నగదు ఉండేలా చర్యలు తీసుకుంది. 5.26 శాతం కటాఫ్ రేటుతో బ్యాంకులకు నిధులను అందించింది. ఇలాంటి సమయాల్లో ఆర్బీఐ జోక్యం చేసుకోకపోతే, నిధుల సమీకరణ వ్యయం పెరిగి, ఆర్థిక వ్యవస్థలో రుణ ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇది ఆర్థిక మందగమనానికి దారితీసే ప్రమాదం ఉంది.ఆర్బీఐ సాధారణంగా పన్ను చెల్లింపులు, ముందస్తు పన్ను చెల్లింపులు లేదా ఇతర కాలానుగుణ రుణ డిమాండ్ వంటి కారణాల వల్ల ఏర్పడే స్వల్పకాలిక నగదు లోటును సరిచేయడానికి వివిధ ద్రవ్య విధాన సాధనాలను ఉపయోగిస్తుంది. తాత్కాలిక నగదు అవసరాల కోసం వీఆర్ఆర్ వేలాలను నిర్వహిస్తుంది.