RBI Penalties: దేశంలోని షెడ్యూల్డ్, నాన్- షెడ్యూల్డ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గట్టి నిఘా పెట్టింది.
నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా మరోసారి కొరడా ఝులిపించింది. ఏకంగా నాలుగు బ్యాంకులపై చర్యలు చేపట్టింది. వివిధ రెగ్యులేటరీ, స్టాటిట్యూటరీ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన క్రమంలో దేశవ్యాప్తంగా 4 కోఆపరేటివ్ బ్యాంకులపై మానీటరీ పెనాల్టీలు విధించినట్లు తెలిపింది. 2025, మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకుల ఆర్థిక స్థితిగతులపై తనిఖీలు నిర్వహించిన క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు బయటపడినట్లు పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలోని వాల్వా ప్రాంతంలో ఉన్న హుతాత్మా సహకారి బ్యాంక్ లిమిటెడ్ పై పెనాల్టీ విధించింది. ఈ బ్యాంకుపై రూ.5 లక్షల జరిమానా వేసింది. బ్యాంకు డైరెక్టర్లలో ఒకరి బంధువుకు రుణాలు మంజూరు చేసినట్లు తేలిన క్రమంలో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనల కింద ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్పూర్ జిల్లా సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Sultanpur Jilla Sahkari Bank Ltd)పై రూ. 3 లక్షల పెనాల్టీ విధించినట్లు తెలిపింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు రుణ గ్రహీతల వివరాలు ఇవ్వడంలో విఫలమవడం, అరకొర కేవైసీ మానీటరింగ్ సిస్టమ్ ఉండడం, అనుమానిత ట్రాన్సాక్షన్లను నివేదించడంలో అలసత్వం, అర్హత గల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవార్నెస్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయడంలో జాప్యం చేయడం వంటి చాలా అంశాలను గుర్తించిన క్రమంలో ఈ బ్యాంకుపై పెనాల్టి విధించింది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో గల చిత్తూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, కర్ణాటకలోని ది శిమోగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 1 లక్ష చొప్పున పెనాల్టీలు వేసింది. డైరెక్టర్లకు సంబంధం ఉన్న వారికి రుణాలు ఇవ్వడం, వాటిని రెన్యూవల్ చేయడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలు గుర్తించిన క్రమంలో ఈ రెండు బ్యాంకులపై జరిమానా వేసినట్లు ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లపై ప్రభావం ఉంటుందా?నియంత్రణ, చట్టపర నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించిన క్రమంలో ఈ పెనాల్టీలు విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే బ్యాంకు కస్టమర్లపై ఈ పెనాల్టీల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఆయా బ్యాంకుల్లో అన్ని రకాల బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. తదుపరి పర్యవేక్షణ చర్యలు చేపట్టాలా వద్దా అనేది బ్యాంక్ పనితీరును బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.