
న్యాయరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్కు చెందిన గార్ఫీల్డ్ ఏఐ అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ.. నిజమైన న్యాయవాదులతో పోటీ పడి కోర్టు కేసులో విజయం సాధించింది.
ప్రపంచంలో ఏఐ సాయంతో నడిచే సంస్థ నేరుగా గెలిచిన తొలి కేసుగా దీనిని భావిస్తున్నారు.ఫ్రీలాన్స్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ టామిరెస్ కమల్ టాక్విడిర్కు ఒక హాస్పిటాలిటీ సంస్థ చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టింది. దీంతో గార్ఫీల్డ్ ఏఐ సేవలను ఆమె ఆశ్రయించింది. కేవలం 400 పౌండ్లు (సుమారు రూ.50 వేల) చెల్లించి ఈ సేవలు పొందింది. ఏఐ సాయంతో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర న్యాయపరమైన డాక్యుమెంట్లన్నీ గార్ఫీల్డ్ ఏఐ సంస్థ సిద్ధం చేసింది. విచారణ వేళ ఒక మానవ న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించేందుకు నియమించింది. లండన్లోని వాండ్స్వర్త్ కౌంటీ కోర్టులో దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది. ఇరు పక్షాల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.చివరికి కోర్టు టాక్విడిర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెకు 7,000 పౌండ్లు (సుమారు రూ.8.8 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యర్థి సంస్థ దాఖలు చేసిన కౌంటర్ క్లెయిమ్ను కూడా కోర్టు కొట్టివేసింది.గార్ఫీల్డ్ ఏఐ సహ వ్యవస్థాపకుడు ఫిలిప్ యంగ్ దీన్ని న్యాయరంగంలో గొప్ప మైలురాయిగా అభివర్ణించారు. ఏఐ సాయంతో న్యాయసేవలు మరింత తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం గార్ఫీల్డ్ ఏఐ 10 వేల పౌండ్ల (సుమారు రూ.12.5 లక్షలు) వరకు ఉన్న చిన్న క్లెయిమ్ కేసులను స్వీకరిస్తోంది.