
Can Cow Urine Fight Chikungunya?: చికున్గున్యా పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది తీవ్రమైన జ్వరం, భరించలేని కీళ్ల నొప్పులు, వారాలు కాదు నెలల పాటు కొనసాగే శారీరక అసౌకర్యం.
ప్రతి వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి దేశంలో మళ్లీ మళ్లీ ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చికున్గున్యాను నేరుగా అడ్డుకునే ప్రత్యేక యాంటీవైరల్ ఔషధం అందుబాటులో లేకపోవడంతో శాస్త్రవేత్తలు కొత్త మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానం, ఆధునిక బయోటెక్నాలజీ కలయికలో వెలుగులోకి వచ్చిన ఐఐటీ రూర్కీ అధ్యయనం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారతీయ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ రూర్కీకి చెందిన బయోసైన్సెస్ అండ్ బయోఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ షైలీ తోమర్ నేతృత్వంలోని పరిశోధక బృందం చేపట్టిన అధ్యయనంలో ఆయుర్వేదంలో ప్రస్తావించే గౌ మూత్ర ఆర్క్ అంటే ఆవు మూత్ర డిస్టిలేట్ను పరిశీలించారు. ప్రయోగశాల పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ పదార్థం చికున్గున్యా వైరస్ పరిమాణాన్ని 90 శాతానికి పైగా తగ్గించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలతో రూపొందించిన ప్రత్యేక ఫార్ములేషన్ వైరల్ లోడ్ను 99.85 శాతం వరకు తగ్గించిందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
ఈ పరిశోధనలో వైరస్ నిరోధక ప్రభావానికి కారణమయ్యే పలు బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫలితాలు పీర్ రివ్యూడ్ శాస్త్రీయ జర్నల్ అయిన ACS(Agricultural Science & Technology)లో ప్రచురితమయ్యాయి. సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే పదార్థాలను ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలతో విశ్లేషించవచ్చని ఈ అధ్యయనం మరోసారి చూపించింది.
చికున్గున్యా వ్యాధి ఏడిస్ దోమల కాటుతో వ్యాపిస్తుంది. జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది కోలుకున్నప్పటికీ కొందరిలో కీళ్ల నొప్పులు చాలా కాలం కొనసాగుతాయి. ప్రస్తుతం చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడంపైనే ఆధారపడి ఉంది. అందుకే వైరస్ను నేరుగా ఎదుర్కోగల కొత్త సమ్మేళనాల అన్వేషణకు ప్రాధాన్యం పెరుగుతోంది.
అయితే ఈ అధ్యయనం వెలుగులోకి వచ్చిందని ప్రజలు ఆవు మూత్రాన్ని స్వయంగా చికిత్సగా ఉపయోగించాలనే అర్థం కాదు. పరిశోధన పూర్తిగా ప్రయోగశాల స్థాయిలో మాత్రమే జరిగింది. మనుషులపై ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ ఇంకా నిర్వహించలేదు. భద్రత, ప్రభావం, మోతాదు వంటి అంశాలపై జంతు పరీక్షలు, క్లినికల్ అధ్యయనాలు, మరిన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత మాత్రమే ఏదైనా వైద్య సిఫార్సు చేయడం సాధ్యమవుతుంది.
ఆరోగ్య నిపుణులు ఇప్పటికీ చికున్గున్యా అనుమానం ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగినంత నీరు తాగాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐఐటీ రూర్కీ పరిశోధన ప్రస్తుతం ఒక ప్రారంభ అడుగుగా మాత్రమే చూడాల్సి ఉంది. అయినప్పటికీ సంప్రదాయ జ్ఞానంలో దాగి ఉన్న సహజ సమ్మేళనాలను ఆధునిక శాస్త్రంతో అధ్యయనం చేస్తే భవిష్యత్తులో కొత్త యాంటీవైరల్ మందుల అభివృద్ధికి మార్గం సుగమం కావచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. శాస్త్రీయ ఆధారాలు మరింత బలపడితే చికున్గున్యాపై పోరాటంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.