
బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఆ కుటుంబంలోని వ్యక్తే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బెంగళూరు, జూన్ 23: నగరంలోని ఒక అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఆ కుటుంబంలోని వ్యక్తే ఈ హత్యలు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన సోమవారం కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో సీగేహళ్లి, ధమానిక్ లేఅవుట్లోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో జరిగింది. ఆ అపార్ట్మెంట్లో సోమసుందర్ (55), అతని భార్య ముత్తులక్ష్మి (48), పెద్ద కుమార్తె శ్వేతతో పాటు చిన్న కుమార్తె సుప్రియ (20) నివసిస్తున్నారు.
ఆ దంపతులతోపాటు చిన్ని కుమార్తె సుప్రియ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సోమసుందర్ దంపతుల పెద్ద కుమార్తె శ్వేతతోపాటు ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొన్నాళ్లుగా కెన్నెత్తో శ్వేత సహజీవనం చేస్తోంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీనిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. శ్వేత భారీగా అప్పులు చేసింది. దాంతో శ్వేతపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవని పోలీసులు దర్యాప్తులో వెల్లడి అయింది. ఈ కారణాంగానే వారిని వీరిద్దరు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సోమవారం శ్వేత, కెన్నెత్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో కత్తితో ఆమెను హత్య చేశారు. అనంతరం నేలపై పడిన రక్తాన్ని వీరిద్దరు శుభ్రం చేశారు. ఆ తర్వాత తండ్రి సోమసుందర్తోపాటు సుప్రియ ఇంటికి వచ్చారు. వారిపై దాడి చేసి.. కత్తితో చంపేశారని పోలీసులు భావిస్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని కేఆర్ పురం పోలీసులు చెబుతున్నారు.
అయితే ఈ హత్యలు పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్వేతతోపాటు కెన్నెత్ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఈస్ట్ పాయింట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉంది.