
విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, విశాఖ పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని పరిశ్రమల్లో తక్షణమే భద్రతా తనిఖీలు (సేఫ్టీ ఆడిట్) నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.పరవాడ మండలం, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని 'దక్షినా ఎనర్జీ' కెమికల్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో ఇద్దరు కార్మికులు లోపలే చిక్కుకుని సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడగా, వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన గురించి తెలియగానే పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.