
అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు.
అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. దాంతో ఆ సమయంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోగా.. ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారని సమాచారం. మరో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో ఫార్మాసిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సీఎం చంద్రబాబు ఆరా..ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన ఇద్దరు కార్మికుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. అలానే హోం మంత్రి అనిత సైతం ఈ విషాద ఘటనపై స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.మరోవైపు ఈ అగ్నిప్రమాదంపై మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు.ఇక ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS) విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో మొదట ఎనిమిది మంది కార్మికులు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. కేంద్ర ఉక్కు శాఖ మూడు సభ్యుల నిపుణుల కమిటీని నియమించి ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను సమీక్షించాలని అధికారులకు సూచించింది.ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, నివాస గృహం, పిల్లలకు ఉచిత విద్య అందించనున్నట్లు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. అదనంగా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.