
రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షా కేంద్రం సిబ్బంది ప్రవేశాన్ని నిరాకరించడం వివాదానికి దారితీసింది.
రాజస్థాన్‌ లోని అజ్మీర్ జిల్లాలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన ఒక విద్యార్థినికి పరీక్షా కేంద్రం సిబ్బంది ప్రవేశాన్ని నిరాకరించడం వివాదానికి దారితీసింది. బుర్ఖా ధరించి వచ్చిన సదరు అభ్యర్థిని భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే చివరకు ఉన్నతాధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సర్దుమణిగింది.బియావర్ ప్రాంతానికి చెందిన కుల్సుమ్ బానో అనే విద్యార్థిని తన తండ్రి మహ్మద్ ఆలిమ్‌ తో కలిసి జూన్ 21 ఆదివారం రోజున అజ్మీర్‌ లోని పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆమె బుర్ఖా, హిజాబ్ ధరించి పరీక్ష రాయడానికి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం బుర్ఖాను తీసివేసి లోపలికి వెళ్లాలని సూచించారు. దీనికి ఆమె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మతపరమైన దుస్తులను అనుమతించే నియమ నిబంధనలకు NTA కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. మహిళా సిబ్బందితో ప్రత్యేకంగా తనిఖీ చేయించాలని కోరినప్పటికీ మొదట అక్కడి సిబ్బంది నిరాకరించారని ఆయన పేర్కొన్నారు.తన మతపరమైన గుర్తింపును కోల్పోయే కంటే పరీక్షను వదులుకోవడానికైనా సిద్ధమేనని విద్యార్థిని కుల్సుమ్ బానో ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. గతంలో మే 3న జరిగిన ప్రధాన పరీక్షకు కూడా తాను ఇదే సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యానని, అప్పుడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తమవలేదని ఆమె గుర్తుచేసింది. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నిబంధనల ప్రకారం తమను అనుమతించాల్సిందేనని ఆమె స్పష్టం చేసింది.ఈ విషయంపై సమాచారం అందుకున్న అజ్మీర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ప్రవేశ నిబంధనలకు సంబంధించి పరీక్షా కేంద్ర సిబ్బందికి ఉన్న గందరగోళాన్ని ఉన్నతాధికారులు నివృత్తి చేశారని సెర్కిల్ ఆఫీసర్ శివమ్ జోషి తెలిపారు. బుర్ఖాకు సంబంధించిన సమస్యను సకాలంలో పరిష్కరించి, అభ్యర్థులందరినీ ప్రశాంతంగా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించినట్లు ఆయన మీడియాకు వివరించారు.దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ యూజీ పునఃపరీక్ష విజయవంతంగా ముగిసింది. ఎలక్ట్రానిక్ అక్రమాలను నిరోధించడానికి పరీక్షా కేంద్రాల్లో భారీగా జామర్లు, నిఘా కోసం లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వివాదం సర్దుమణగడంతో కుల్సుమ్ బానో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పరీక్షకు హాజరయింది.